అమరావతిలో స్మార్ట్‌ బైకులు పరుగులు తీయనున్నాయి. తొలిసారిగా వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వం వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది. ఇక్కడ విజయవంతమైతే సీఆర్‌డీఏ పరిధిలో ట్రాక్‌లు ఏర్పాటుచేసి ప్రజలకు, సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్‌ బైక్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే జర్మనీ నుంచి 30 సైకిళ్లు సచివాలయానికి చేరాయి. ఆవరణలోపల ప్రస్తుతం రెండు స్మార్ట్‌ సైకిల్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. సచివాలయం వాహనాల పార్కింగ్‌ వద్ద మరో స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నారు...

smart bikes 26012018 2

ప్రతి స్టేషన్‌లో 10 సైకిళ్లను ఉంచుతారు. అవసరమైన వారు సైకిల్‌ తీసుకుని వెళ్లవచ్చు. సైకిల్‌ కావలసిన వ్యక్తికి స్వైపింగ్‌ కార్డు ఇస్తారు. పాస్‌వర్డ్‌ ఇస్తారు. పాస్‌వర్డ్‌తోనే సైకిల్‌ లాక్‌ తెరుచుకుంటుంది. సచివాలయం లోపల, బయట సందర్శకులు వీటిని ఉపయోగించుకోవచ్చు. పని ముగించుకున్న తర్వాత ఆ సైకిల్‌ను 3 స్టేషన్లలో ఏదో ఒకచోట నిలిపి వెళ్లిపోవచ్చు... ఇవీ ప్రత్యేకతలు.. ఈ స్మార్ట్‌ బైక్స్‌ బాడీ మొత్తం ఎల్లాయిడ్‌, అల్యూమినియంతో తయారు చేయబడింది. వర్షంలో తడిసినా తుప్పు బట్టే అవకాశం లేదు. ఈ బైక్‌కు మూడు గేర్లు ఉన్నాయి...

smart bikes 26012018 3

దీని విలువ రూ.50 వేలపైనే ఉంటుంది. ఈ బైక్‌ కదలాలంటే స్వైపింగ్‌ కార్డు ఉండాలి. ఇందుకు పాస్‌వర్డ్‌ తెలియాలి. దీనికి జీపీఎస్‌ సిస్టం అమర్చబడి ఉంటుంది. ఎవరైనా దొంగిలించినా సైకిల్‌ ఎక్కడ ఉందో వెంటనే తెలుసుకోవచ్చు. రాత్రి పూట కూడా వినియోగించుకునేందుకు ద్విచక్ర వాహనాలకు వలే ఫ్రంట్‌, బ్యాక్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఈ సైకిల్‌కి అమర్చిన బ్యాటరీ చార్జింగ్‌ చేయకపోయినా ఏడాదిపాటు పని చేస్తుందని అధికారులు తెలిపారు. హ్యాండిల్‌ లాక్‌ కూడా ఆటోమేటిక్‌ సిస్టంలోనే ఉంటుంది.

 

Advertisements