గంజాయి స్మగ్లర్లు ఎత్తుకు పై ఎత్తు వేస్తుంటే పోలీసులు ఒకడుగు ముందుకేసి వారి వ్యూహాలు చిత్తు చేస్తున్నారు. విజయవాడ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇసుక లారీలో ఇసుక కింద ఈ మూటలు పెట్టి తరలిస్తుండగా వెలికి తీశారు. విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నారని పక్కాగా అందిన సమాచారం మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు మాటువేశారు. లారీ రాగానే నిలువరించి తనిఖీలు చేయగా ఇసుక కుప్పల కింద గంజాయి మూటలు గుర్తించారు. మొత్తం 1137 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, దీని విలువ 2.27 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. సరుకు స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నర్సీపట్నం ఏజెన్సీలోని సపర్ల గ్రామం నుంచి హైదరాబాద్‌కు గంజాయి భారీగా రవాణా అవుతున్నట్లు స్పష్టమైన సమాచారం రావడంతో విజయవాడ నగర శివారులో శుక్రవారం పట్టుకున్నట్లు తెలిపారు.

Advertisements