ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి ఐకానిక్ భవనంలా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నగరంలో నిర్మించిన మిలీనియం టవర్స్ బుధవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకూ మూడు వేర్వేరు భవనాల్లో కార్యకలాపాలు సాగిస్తూ వచ్చిన కాండ్యుయెంట్ సంస్థ వాటిని ఖాళీ చేసి సర్వాంగ సుందరంగా నిర్మించిన నూతన భవనంలోకి అడుగుపెట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచంలోని అత్యుత్తమ ఐ.టి. సంస్థల్లో ఎలాంటి వసతులు తమతమ ఉద్యోగులకు కల్పిస్తాయో అలాంటి విస్తృతమైన అధునాతన సదుపాయాలను ఆ ఐకానిక్ భవనంలో అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రప్రభుత్వం మిలీనియం టవర్స్ నిర్మాణంలో భాగంగా టవర్-1ను రూ. 145 కోట్లతో మధురవాడ ఐ.టి.హిల్స్లో నాలుగెకరాల విస్తీర్ణంలో నిర్మించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే ఆ భవనాన్ని ప్రారంభించినప్పటికీ బుధవారం నుంచి కాండ్యుయెంట్ సంస్థ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. మొత్తం పది అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించారు. అందులో రెండు అంతస్తులు వాహన పార్కింగ్కు వదిలేశారు. మిగిలిన అంతస్తుల్లో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. అత్యాధునిక వసతులు: * అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం లోపలి ప్రాంగణాన్ని కాండ్యుయెంట్ సంస్థ తీర్చిదిద్దింది. * విశాలమైన ప్రాంగణంలో అత్యంత సౌకర్యంగా విధులు నిర్వర్తించుకునేలా సీటింగ్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. * భవనం మొత్తానికి సెంట్రల్ ఏసీ సౌకర్యం కల్పించారు. * లాబీ, కారిడార్లలో ఇటాలియన్ మార్బుల్తో ఫ్లోరింగ్ చేశారు.
* ఉద్యోగులు ఎలాంటి ఆకస్మిక అనారోగ్యానికి గురైనా తక్షణ వైద్యం అందేలా ఒక వైద్యుడు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. * ప్రతి అంతస్తులోని కారిడార్లో కొద్దిసేపు మాట్లాడుకుంనేందుకు వీలుగా అధునాతన సోఫాలు వేశారు. * అనారోగ్యానికి గురై కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే సౌకర్యంగా ఉండేలా స్త్రీ, పురుషులకు వేర్వేరుగా సిక్రూమ్లు అందుబాటులో ఉంచారు. * చిన్నపిల్లలున్న మహిళా ఉద్యోగినుల కోసం క్రెష్, పిల్లలకు సేవలు అందించడం కోసం ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించారు. * భోజనాలు చేయడానికి కూడా అందమైన డైనింగ్ గదిని నిర్మించారు. * భవన భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అధునాతన అగ్నిమాపకవ్యవస్థలు ఏర్పాటుచేశారు. * లిఫ్ట్లకు ప్రత్యామ్నాయంగా విశాలమైన మెట్ల మార్గాలను అందుబాటులో ఉంచారు.