‘ఎక్కడైనా పొలాల దగ్గరే గొడవలు పడతారు. సరిహద్దు తగాదాలు వస్తాయి. ఇరుగుపొరుగు, చివరికి అన్నదమ్ములు కూడా పొలం గట్ల తగాదాలతోనే కత్తులు దూస్తారు. భూసేవ ద్వారా ఇకపై ఇలాంటి వివాదాలు ఉండవు. ప్రతి భూమికి ఒక క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ సహాయంతో భూమికి సంబంధించిన కచ్చితమైన కొలతలు తెలుసుకునే వీలు కలుగుతుంది. షేర్లు అమ్ముకున్నట్టే భూములను సులభంగా విక్రయించేందుకు కొత్తగా తీసుకొచ్చిన ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు. దేశంలో ఎవరూ ఊహించని ప్రాజెక్టుకు ఏపీలో శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి అన్నారు. ‘మన భూమిపై ఎప్పుడు అనుమానం వచ్చినా జేబులో పెట్టుకుని చూసుకునే అవకాశాన్ని ఇప్పుడు తీసుకొచ్చాం. ప్రజల ఆస్తులను పరిరక్షించేందుకు అత్యాధునిక సాంకేతికతను కొత్త ప్రాజెక్టులో వినియోగించుకున్నాం’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

budhar 20112018 2

ఫోర్జరీ చేయడానికి కొత్త విధానంలో ఎటువంటి అవకాశమూ లేదని, వేలిముద్రలు, కనుపాపల ఆధారంగా మనుషులకు ఆధార్‌ ఇచ్చినట్లే భూములు, ఆస్తుల గుర్తింపునకు సర్వేనెంబర్లు, సబ్‌ డివిజన్ల ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలతో భూధార్‌ ఇస్తామని వివరించారు. భార్య భూమిని భర్త కొట్టేయడానికి కూడా వీలులేని పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఎవరి భూమి ఎక్కడ ఉందో కచ్చితమైన వివరాలతో అందించడం ఈ ప్రాజెక్టుతో సాధ్యపడుతుందని చెప్పారు. ఇది తన చిరకాల కోరిక అని చెబుతూ, ఈ కలను సాకారం చేసిన యుఐఏడీఐ చైర్మన్ జె. సత్యనారాయణను అభినందించారు. ఆయన సమర్ధత తెలుసు కనుకనే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడి ఐటీ అడ్వయిజర్‌గా తొలి పోస్టింగ్ ఇచ్చానని చెప్పారు. ప్రభుత్వానికి అన్నింటికంటే అతి పెద్ద సమస్య భూవివాదాలేనని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు.

budhar 20112018 3

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పకడ్బందీగా విధానాలను అమలుచేసి ప్రభుత్వ భూములను సమర్ధంగా కాపాడుకోగలిగామని చెప్పారు. ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించిన గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్ ప్రజల మన్ననలను అందుకున్నారని గుర్తుచేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో అవినీతిని రూపుమాపడానికి రెవిన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టామని, మరోపక్క అత్యాధునిక సాంకేతికతను గరిష్ఠస్థాయిలో వినియోగించుకుని ఫలితాలను సాధిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రెవిన్యూ శాఖకు ఇప్పటివరకు ఒక విధమైన చెడ్డపేరు ఉండేది, ఇప్పుడది రివర్స్ అవుతుందని అన్నారు. ఒకప్పుడు భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవని, రిజిస్ట్రార్లకు సైతం లంచాలు ఇస్తే తప్ప రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేది కాదని చెప్పారు.

రెవిన్యూ భూముల వివరాలను ఆన్‌లైన్ చేయడంలో ముందున్న కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మికాంతంకు ముఖ్యమంత్రి ప్రశంసాపత్రాన్ని అందించారు. అనంతపురం జిల్లా ద్వితీయ స్థానం సాధించిందని తెలిపారు. రెవిన్యూ శాఖలోనే కాకుండా మిగిలిన శాఖలు కూడా సాధ్యమైనంత వేగంగా వివరాలు డిజిటైజ్ చేయాలని సూచించారు. ‘29 అవినీతి రహిత రాష్ర్టాలలో మూడవస్థానంలో ఉన్నాం. దాంతో సంతృప్తి పడటం లేదు. అవినీతి రహిత రాష్ట్రాలలో దేశంలో మన రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలపడానికి కృషిచేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా జరగనంత అభివృద్ధి ఏపీలో జరిగిందంటే అందుకు కారణం సాంకేతికతను మనం సద్వినియోగం చేసుకోవడమేనని తెలిపారు. ‘ఈనెలలో నామీద 76 శాతం ప్రజాసంతృప్తి ఉంది. ఫ్రభుత్వ సేవలపై 80 శాతానికి మించి సంతృప్తి ఉంది. కొన్ని శాఖలలో 99 శాత సంతృప్తి ఉంది. కేంద్రం మనకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. ఎక్కడా రాజీపడకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్‌లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన విషయాన్ని ముఖ్యమంత్రి సభలోనే ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్టే ఈజ్ ఆఫ్ లివింగ్‌లో అగ్రస్థానంలో ఉండాలన్నదే తన కోరికగా చెప్పారు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే మరో పదేళ్లు బతకుతామని అనుకునేలా జీవన ప్రమాణాలు పెంచుతున్నామని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read