రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని వైసీపీ కుట్ర పన్నడం వాస్తవమేనని స్పష్టమైంది. ఇప్పటివరకు పోలీసులు నమోదుచేసిన కేసులను పరిశీలిస్తే 2,81,000 అసలైన ఓట్లను తొలగించాలని ఫామ్-7 దరఖాస్తులు రాగా.. అందులో 95 శాతం వైసీపీ పెట్టిన దరఖాస్తులే కావడం గమనార్హం. బూత్ స్థాయి నాయకుల పేరిట.. ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఫిర్యాదులను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఏ సంబంధం లేని బూత్ స్థాయి నేతలు ఇప్పుడు పోలీసు కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇతరుల ఓటుహక్కు తొలగించేందుకు కుట్ర చేయడంతోపాటు తమ సమయం వృథా చేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్కడికక్కడ పోలీసులకు ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో తమ కళ్ల ముందు కనిపించే వారి ఓట్లు తొలగించాలని ఫిర్యాదు చేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు.
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రానికి 355 కేసులు నమోదైనట్లు తెలిసింది. ఇందులో 239 కేసుల్లో సూత్రధారులెవరో తేలింది. మరిన్ని కేసుల్లో చనిపోయిన వారి పేరుతో ఫిర్యాదులు వచ్చాయి. అప్లోడ్ చేసిన ఐపీ అడ్ర్సల ఆధారంగా బాధ్యులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకూ 13 జిల్లాల్లో 2,300కి పైగా ఐపీ అడ్ర్సలను పసిగట్టినట్లు సమాచారం. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ అప్లోడ్ చేసిన ఫామ్-7లే అధికంగా ఉండగా ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం టీడీపీ నుంచి ఎక్కువగా వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వాటితో పోలిస్తే తెలుగుదేశం వాటా 3 శాతమే. రెండు శాతం ఫిర్యాదులు పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు చేసినట్లు తెలిసింది. మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుంచి అప్లోడ్ అయిన దరఖాస్తులు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని సీ డాక్ ద్వారా తీసుకుని పకడ్బందీగా దర్యాప్తు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది.
డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వేల సంఖ్యలో ఫామ్-7 దరఖాస్తులు పెట్టి అడ్డంగా బుక్కయ్యారని తెలిసింది. తన నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓటర్ల జాబితాను సేకరించి.. వేల సంఖ్యలో ఓట్లు తొలగింపునకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. పలు నెట్ సెంటర్ల నుంచి ఫామ్-7 దరఖాస్తులు అప్లోడ్ అయ్యాయి. ఆయా సెంటర్ల నిర్వాహకులను పోలీసులు విచారించారు. ఈ పనిచేయాలని ఎవరు చెప్పారు.. ఇలా చేసినందుకు ఎంత డబ్బు ఇచ్చిందీ వారు వెల్లడించినట్లు తెలిసింది. ఇందులో ఎక్కువగా ఒక బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి (కేఈ కుటుంబం నుంచి) టీడీపీ తరపున బరిలో నిలవనున్నారు. దాంతో ఆ వర్గం ఓటర్లను వైసీపీ టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.