తెలుగు సినీ పరిశ్రమను రాజధాని అమరావతికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సినిమాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి ఆకర్షించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అమరావతి రాజధాని నగర పరిధిలోని అనంతవరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని 5,167 ఎకరాల్లో మీడియా సిటీని ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
మీడియా నగరంలో సినీ - టెలివిజన్ పరిశ్రమ, నిమేషన్ - వీఎఫ్ఎక్స్ - గేమింగ్, డిజిటల్ యాడ్ - సోషల్ మీడియా, టెలికం రంగాలను ప్రోత్సహించనుంది. అమరావతిలో20 నుంచి 30 ఎకరాల్లో స్టూడియో నెలకొల్పడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీన్ని ఏర్పాటు చేసే సంస్థలకు నామమాత్రపు ధర (ఎకరం రూ. 50లక్షలు)కు భూములిస్తామని ప్రకటించింది. ఇక్కడ సినిమాను నిర్మిస్తే ప్రొడక్షన్ ఖర్చులో కొంత మొత్తాన్ని రీయింబర్స్ చేయడం, నగదు ప్రోత్సా హకాలు ఇవ్వడం వంటి అంశాలను పరిశీలిస్తోంది. సినిమాలకు సింగిల్ విండో అనుమతులిచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. అమరావతిలో ప్రారంభించే తెలుగు న్యూస్ చానళ్లకు తక్కువ ధరకే భూములివ్వాలని నిర్ణయించింది.
అయితే చంద్రబాబు ప్రయత్నానికి ఎంత మంది సినీ పెద్దలు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతం వారే ఉన్నారు... కాని వీరు అందరూ హైదరాబాద్ లో స్థిరపడి పోయారు... వీరికి అమరావతి అంటే అంత ప్రేమ లేదు అనే విషయం వివిధ సందర్భాల్లో రుజువైంది... మరి చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహకాలకి వారు ఎలా స్పందిస్తారో చూడాలి... మరో పక్క న్యూస్ చానళ్లకు కూడా ఇదే పరిస్థితి ఉంది.. ఇప్పటికే స్టూడియో ఏర్పాటుకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, బాలీవుడ్ ప్రముఖుడు సుభాష్ ఘయ్లను ఆహ్వానించి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. మరి మన టాలీవుడ్ నుంచి మొదటి ఎవరు వస్తారో చూడాలి...