టీఆర్ఎస్, వైసీపీలు తమకు మిత్రులేనని బీజేపీ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్లో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘విజన్ ఇండియా’ అనే అంశంపై మాట్లాడుతూ.. బీజేపీకి సొంతంగా 300 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ‘జగన్, కేసీఆర్ మీ మిత్రులు. మీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారుగా?’ అన్న ప్రశ్నకు.. ‘కచ్చితంగా! అదృష్టవశాత్తూ దానిపై ఎలాంటి జీఎస్టీ ఉండదు’ అని పీయూష్ సమాధానమిచ్చారు. ఎన్నికలకు 60 రోజుల ముందు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వచ్చి ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఆమె సోదరుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ విఫలమైనందునే.. ఆమె రాజకీయాల్లోకి వచ్చారా? అని ఎద్దేవా చేశారు. రామ జన్మభూమిలోనే మందిరాన్ని నిర్మించి తీరుతామన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో శామ్పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై గోయల్ మండిపడ్డారు. దేశాన్ని మోదీ రక్షిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. మహిళల భాగస్వామ్యంతోనే దేశ నిర్మాణం జరుగుతుందని గోయల్ అభిప్రాయపడ్డారు. దేశ రక్షణలో మీడియా కూడా చౌకీదార్గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.